
సర్వేపల్లి(ఈటీవీ): కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ పోటాపోటీగా జరుగుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీలోని కామాక్షినగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి పార్లమెంటు తెదేపా అధ్యక్షురాలు పనబాక లక్ష్మితో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. తన సొంతూరుతో సమానమైన తోటపల్లి పంచాయతీలో పింఛన్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో తోటపల్లి పంచాయతీలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తోటపల్లి పంచాయతీలో ప్రతి నెలా రూ.7.50 లక్షల మేర ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. మూడు జిల్లాల ప్రజల 30 ఏళ్ల కలను నెరవేరుస్తూ వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి నీటిని విడుదల చేశామని, త్వరలో పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందించబోతున్నామని తెలిపారు. వైకాపా పాలనలో నిర్వీర్యమైన నీటిపారుదల శాఖకు పూర్వవైభవం తీసుకొస్తున్నామన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు