
ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని విధానంగా ఉపయోగించే దేశాలకు గట్టి సందేశం ఇవ్వాలని అన్నారు. ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక ఆయుధం కారాదని తేల్చి చెప్పారు. కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రౌండ్టేబుల్ చర్చలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశానికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా పలువురు దేశాధినేతలు హాజరయ్యారు.ఉగ్రవాదం విషయంలో ఎలాంటి ద్వంద్వ వైఖరికి అవకాశం ఉండకూడదని మోదీ అన్నారు. ఈ తీవ్రమైన అంశంపై అన్ని దేశాలు ఒకే గొంతుతో మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తమ విధానంలో భాగంగా ఉపయోగించే దేశాలతో పాటు ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇచ్చే దేశాలకు కూడా గట్టి సందేశం ఇవ్వాలని అన్నారు.అంతకుముందు ఎస్సీఓ నేతలు అధికారిక గ్రూప్ ఫొటోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో కొద్దిసేపు మాట్లాడారు. రెండు రోజుల సదస్సు సందర్భంగా మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అయితే షీ జిన్పింగ్తో మోదీ భేటీ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.26వ ఎస్సీఓ సదస్సులో 10 సభ్య దేశాలతో పాటు 15 భాగస్వామ్య దేశాలు, రెండు పరిశీలక దేశాలు పాల్గొంటున్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు