తిరుమల శ్రీవారిని మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ అభిమాని రామచంద్ర రాజు అలియాస్ ఎన్టీఆర్ కుమారుడు శ్రీధర్ వర్మ ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా.. ఆయనతో కలసి నందమూరి రామకృష్ణ , మోహనకృష్ణ కుటుంబంతో స్వామివారిని దర్శించుకున్నారు. రామచంద్రరాజుతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. శ్రీధర్ వర్మకు తన తండ్రి ఎన్టీఆర్, ఎన్టీఆర్ రాజు ఆశీస్సులు ఉండాలంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.ఎన్టీఆర్ రాజు రెండుసార్లు వరుసగా పాలకమండలిలో సభ్యుడిగా ఉన్నారని.. మూడోసారి పదవి ఇవ్వబోతే ఎన్టీఆర్ వద్దని చెప్పిన విషయాన్ని నందమూరి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఎన్టీఆర్ టీటీడీ పాలకమండలి సభ్యుల పదవీ కాలానికి సంబంధించి ఓ నిబంధనను తీసుకొచ్చారని.. టీటీడీ పాలకమండలిలో రెండుసార్లకు మించి ఎవరూ ఉండకూడదని ఎన్టీఆర్ జీవో తెచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజు సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.శ్రీధర్ వర్మకు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిరావడం ఆనందంగా ఉందన్నారు నందమూరి మోహనకృష్ణ. శ్రీధర్ వర్మ తండ్రి ఎన్టీఆర్ రాజుతో తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ రాజు పిల్లలు మాకు సోదరసమానులు.. అందరం అన్నదమ్ముల్లా ఉంటామన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ఎన్టీఆర్ రాజును పోటీచేయమని కోరితే.. ఆయన నిరాకరించి 'మీకు సేవ చేసుకుంటాను' అని చెప్పిన మాటన గుర్తు చేశారు. ఎన్టీఆర్ కోరితేనే టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించారని.. ఆయన భూ దానం కూడా చేశారన్నారు. అంతేకాదు ఎన్టీఆర్ రాజు గతేడాది కన్నుమూశారు.. ఆయన పాడెను మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు కుమారులు నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ మోశారు.టీడీపీ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ టీటీడీకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్గా నియమితులయ్యారు