
ఒక రోజు ఓ చిన్న పిల్లవాడు సముద్ర తీరంలో ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాడు. అంతలో ఒక్కసారిగా ఓ పెద్ద అల వచ్చి అతని చెప్పులను సముద్రంలోకి లాక్కెళ్లింది. తన చెప్పులు పోవడంతో ఆ బాలుడు బాధపడ్డాడు. వెంటనే ఇసుకపై పెద్ద అక్షరాలతో "సముద్రం ఒక దొంగ" అని రాశాడు. ఆ క్షణంలో అతని దృష్టిలో సముద్రం అంటే తనకు నష్టం చేసిన దొంగ మాత్రమే. కొంతసేపటి తర్వాత అదే సముద్రంలోకి వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు బోలెడన్ని చేపలతో ఆనందంగా తిరిగి తీరానికి చేరుకున్నాడు. ఆ రోజు అతని కుటుంబానికి ఆహారం, ఆదాయం రెండూ సముద్రం వల్లే లభించాయి. కృతజ్ఞతతో అతడు ఇసుకపై "సముద్రుడు గొప్ప దాత" అని రాశాడు. ఒకరికి దొంగగా కనిపించిన సముద్రం, మరొకరికి దాతగా కనిపించింది. అదే సమయంలో ఓ వృద్ధురాలు సముద్రం ఒడ్డున నిలబడి కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకంటే కొంతకాలం క్రితం ఆమె కొడుకు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. తన బాధను తట్టుకోలేక ఆమె ఇసుకపై "సముద్రం ఒక హంతకుడు" అని రాసింది. ఆమె జీవితంలో సముద్రం అంటే తన బిడ్డను దూరం చేసిన క్రూరమైన శక్తి. ఒకరు దొంగ అన్నారు... మరొకరు దాత అన్నారు... ఇంకొకరు హంతకుడు అన్నారు. ఇలా ఒక్కొక్కరు తమ అనుభవాన్ని బట్టి సముద్రానికి ఒక పేరు పెట్టారు. కానీ కొద్దిసేపటికే మరో భారీ అల వచ్చింది. ఇసుకపై రాసిన ఆ మాటలన్నింటినీ ఒక్క క్షణంలో చెరిపేసి వెళ్లిపోయింది. అక్కడ సముద్రం మారలేదు. మారింది కేవలం మనుషుల అభిప్రాయాలే. ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. మన గురించి ఎవరు ఏమనుకుంటున్నారో దానిపై మన విలువ ఆధారపడి ఉండదు. ఒకరి అవసరానికి అనుగుణంగా మనల్ని పొగడవచ్చు. మరో సందర్భంలో అదే వ్యక్తి మనల్ని విమర్శించవచ్చు. అందుకే పొగడ్తలు వచ్చినా పొంగిపోవద్దు. విమర్శలు వచ్చినా కుంగిపోవద్దు. ఎదుటివారి మాటలను మనసుకు