ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. అక్టోబర్లో ఈ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే, ఇటీవల నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తుది ఓటర్ల జాబితాలతో కాకుండా.. 2025 నాటి ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ఓటర్ల జాబితాల ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 3న సర్ తుది ఓటర్ల జాబితాలు ప్రచురించనున్నారు. వాటిని ప్రామాణికంగా తీసుకుని స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలు ప్రచురిస్తే ఎన్నికల నిర్వహణ జాప్యమవుతోందని భావిస్తున్నారు. ఈ కారణంతో 2025 నాటి జాబితాలతోనే ఎలక్షన్స్కి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఈ మేరకు ముందుగా పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఫొటో గుర్తింపు ఓటరల్ జాబితాల ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పుర, నగరపాలక,నగర పంచాయతీల్లో.. ఆ తర్వాత గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆశావాహులంతా సన్నద్ధమవుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి.ఇక స్థానాల రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందంటేనే ఎన్నికలు సమీపించాయని అర్థం అంటూ అధికారులు చెబుతున్నారు. దాంతో ఓటర్ల జాబితా ప్రచురణపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.మున్సిపాలిటీల్లో వచ్చే నెల 3లోగా, ఇప్పటి వరకు ఓటర్ల జాబితా సిద్ధం చేయని సుమారు 50 పంచాయతీల్లో ఈ నెల 17వ తేదీలోగా ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను ఎన్నికల సంఘం ఆదేశించింది. పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఎంపిక, వాటికి సంబంధించిన పబ్లికేషన్ ప్రక్రియ కూడా ఈ నెల 21 నుంచి 31లోగా పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల సిబ్బందికి శిక్షణతో పాటు ఏర్పాట్లు కూడా