
Idli Sambar In Government Schools : ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన మెనూలో కీలక మార్పులు చేసింది. ప్రధాన మంత్రి పోషన్ శక్తి నిర్మాణ్ పథకం కింద ఇకపై విద్యార్థులకు ఇడ్లీ–సాంబార్ కూడా అందించనున్నారు. ఢిల్లీ విద్యాశాఖ సవరించిన కొత్త మెనూను అమలు చేయాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త మెనూ ప్రకారం.. ఆగస్టు 24వ తేదీలోపు ఇండ్లీ- సాంబర్ను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇండ్లీ తయారీకి అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాలు, సిబ్బందికి శిక్షణ వంటి ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు. విద్యార్థులకు అందించే ఆహారంలో మరికొన్ని మార్పులు కూడా చేశారు. రాగి హల్వాకు బదులుగా గోధుమ పిండి, చనా మసాలాను చేర్చారు. అదేవిధంగా వెజిటబుల్ దలియాకు బదులుగా జొన్నలు, సజ్జలతో తయారు చేసిన ఆహారాన్ని అందించనున్నారు. ఆరు రోజుల మెనూ ఇదే.. ♦ సోమవారం : పూరీ, నల్ల శనగ గ్రేవీ, ఉడకబెట్టిన కూరగాయలు మెత్తగా చేసి ఇస్తారు ♦ మంగళవారం : ఇండ్లీ, సాబార్ ♦ బుధవారం : అన్నం, చోలే, ఉడక బెట్టిన కూరగాయలు ♦ గురువారం : పూరీ, చోలే, ఉడకబెట్టిన కూరగాయలు ♦ శుక్రవారం : అన్నం, పప్పు ♦ శనివారం : అన్నం, కడీ విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందించేందుకు వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు