
గత కొన్ని రోజులుగా ఆగకుండా పరుగులు తీసిన పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.1,54,970కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.850 తగ్గడంతో రూ.1,42,050 వద్ద నమోదైంది. విజయవాడలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,54,970, 22 క్యారెట్ల పసిడి రూ.1,42,050, 18 క్యారెట్ల బంగారం రూ.1,16,920గా నమోదైంది. అయితే బంగారం ధరలు తగ్గాయన్న కారణంతో వెంటనే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం కంటే.. మీ నగరంలోని రిటైల్ మార్కెట్ ధరలు, నగలపై మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అంశాలను కూడా పరిశీలించడం మంచిది. ఇక పసిడి ధరలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మాత్రం కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న విభేదాలు మార్కెట్లలో ఆందోళన పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు సాధారణంగా రిస్క్ ఉన్న ఆస్తుల కంటే బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. అందుకే పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మరోవైపు హర్మూజ్ జలసంధి అంశం కూడా మార్కెట్లను కలవరపెడుతోంది. ఇరాన్తో చర్చలకు ప్రస్తుతం ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. హర్మూజ్లో పరిమిత స్థాయిలో నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, జలసంధి పూర్తిగా మూసుకుపోలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా వాదనలను ఖండిస్తోంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు హర్మూజ్పై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒమన్ విషయంలోనూ అమెరికా వైఖరి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇరాన్తో సంప్రదింపుల్లో ఒమన్ వ్యవహరిస్తున్న తీరుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. మరోవైపు సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి చేసినట్లు ఇరాన్ సపోర్ట్ ఉన్న హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ పరిణామాలతో ముడిచమురు మార్కెట్లలోనూ ఆందోళన కొనసాగుతోంది