
భూమి ఏర్పడిన తొలినాళ్లలో సముద్రాలు నేటిలా ఉప్పగా ఉండేవి కావు. భూమి చాలా వేడిగా ఉన్న సమయంలో అగ్నిపర్వతాల నుంచి వెలువడిన ఆవిరి, వాయువులు, అంతరిక్షం నుంచి వచ్చిన ఉల్కలు వంటి వాటి ప్రభావంతో క్రమంగా నీటి వనరులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో సముద్రపు నీటిలో నేటి స్థాయిలో ఉప్పు లేదు. కాలం గడిచేకొద్దీ వర్షాలు కురిశాయి. వర్షపు నీరు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను కొంత గ్రహించడం వల్ల స్వల్పంగా ఆమ్ల గుణాన్ని పొందుతుంది. ఈ నీరు నేలపై ప్రవహిస్తూ రాళ్లను, మట్టిని క్రమంగా కరిగిస్తుంది. రాళ్లలో ఉండే వివిధ ఖనిజాలు నీటిలో కలుస్తాయి. వాటిలో సోడియం, క్లోరైడ్ వంటి పదార్థాలు కూడా ఉంటాయి. ఇవే తర్వాత సముద్రపు ఉప్పులో ముఖ్యమైన భాగాలుగా మారతాయి. ఈ ఖనిజాలను కలుపుకున్న నీరు వాగులు, నదుల ద్వారా సముద్రాల్లోకి చేరుతుంది. సముద్రంలోకి చేరిన తర్వాత నీరు సూర్యుడి వేడి కారణంగా ఆవిరైపోతుంది. కానీ నీటిలో కరిగి ఉన్న ఉప్పు ఆవిరితో కలిసి వెళ్లదు. అది సముద్రంలోనే మిగిలిపోతుంది. ఇలా లక్షల, కోట్ల సంవత్సరాల పాటు ఉప్పు చేరుతూ ఉండటంతో సముద్రపు నీరు ఉప్పగా మారింది. సముద్రంలోకి ఉప్పును తీసుకెళ్లేది నదులే అయినప్పుడు నదుల నీరు కూడా ఉప్పుగా ఉండాలి కదా అనే సందేహం రావచ్చు. వాస్తవానికి నదుల నీటిలో కూడా కొంత మొత్తంలో కరిగిన ఖనిజాలు, లవణాలు ఉంటాయి. అయితే వాటి పరిమాణం సముద్రంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం నదుల నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉండటమే. వర్షపు నీరు రాళ్ల నుంచి ఖనిజాలను కరిగించుకుని నదుల్లోకి తీసుకువస్తుంది. ఆ నీరు ఒకే చోట ఎక్కువకాలం నిలిచిపోదు. నది ప్రవాహంతో ఆ నీరు ముందుకు సాగి చివరకు సముద్రంలో కలుస్తుంది. ఒక గిన్నెలో నీటిని ఉంచి అందులో కొద్దిగా ఉప్పు వేస్తే కొంతకాలానికి ఆ నీరు ఉప్పగా మారుతుంది. కానీ ఆ గిన్నెలోకి