
నగరానికి 33% పీఎం 2.5 ధూళికణాలు పొరుగు దేశం నుంచే.. దిల్లీ: దేశ రాజధాని నగరమైన దిల్లీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుపోతుండటానికి పొరుగు దేశమైన పాకిస్థాన్ కూడా ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. నగరవాసులను సతమతం చేసే పీఎం 2.5 ధూళికణాల్లో ఏటా దాదాపు 33% పొరుగు దేశం నుంచే ఇక్కడికి వస్తున్నాయి. పంజాబ్లో కాలుష్యానికీ అది ఓ గణనీయ కారణంగా నిలుస్తోంది. ‘బియాండ్ స్టేట్ బౌండరీస్: క్వాంటిఫైయింగ్ ఇంటర్స్టేట్ ఎయిర్ పొల్యూషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ సెక్టోరల్ సొల్యూషన్స్ ఇన్ ది ఇండో-గ్యాంగేటిక్ ప్లెయిన్’ పేరుతో ‘సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్టీఈపీ)’ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పలు ఆందోళనకర విషయాలను బయటపెట్టింది. నివేదిక ప్రకారం- జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో పీఎం 2.5 ధూళికణాల వార్షిక గాఢత సగటు ఒక్కో క్యూబిక్ మీటరుకు 67.9 మైక్రోగ్రాములుగా ఉంది. ఇందులో స్థానిక వనరుల వల్ల వెలువడే ధూళికణాల వాటా కేవలం 28 శాతం. ప్రధానంగా ఇళ్లలో కార్యకలాపాలు, వ్యవసాయ పనులు, రవాణా, పారిశ్రామిక కార్యకలాపాల వల్ల ఈ ధూళికణాలు వెలువడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి 12 శాతం పీఎం 2.5 ధూళికణాలు ఎన్సీఆర్కు వీస్తున్నాయి. పాక్ నుంచి 33 శాతం వస్తున్నాయి. పంజాబ్లో పీఎం 2.5 ధూళికణాల వార్షిక గాఢత సగటు ఒక్కో క్యూబిక్ మీటరుకు 77.8 మైక్రోగ్రాములుగా ఉంది. ఈ కాలుష్య కణాల్లో దాదాపు 40 శాతం మేర రాష్ట్రానికి పాక్ నుంచి వస్తున్నాయి. ఇక స్థానిక కాలుష్యంలో 52 శాతానికి నివాస రంగ కార్యకలాపాలు కారణమవుతున్నాయి. తర్వాతి స్థానానంలో పారిశ్రామిక కార్యకలాపాలు (13.8 శాతం) ఉంటున్నాయి. వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత 7.9 శాతం మేర పీఎం 2.5 ధూళికణాల కాలుష్యానికి దారితీస్తోంది. రాజస్థాన్, ఎన్సీఆర్ల నుంచీ కాలుష్య కణాలు పంజాబ్కు వస్తున్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ