© 2026 nimisham.in
వర్షాకాలం వచ్చిందంటే సైబరాబాద్ ఐటీ కారిడార్లో ఉద్యోగులకు ట్రాఫిక్ భయం వెంటాడుతోంది. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే రహదారులు వర్షం పడితే నరకప్రాయంగా మారుతున్నాయి. గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఫ్లైఓవర్లు, రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి వంటి చర్యలు చేపడుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీకి కారణాలను గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.సైబరాబాద్ ఐటీ కారిడార్లో సుమారు 1200 చిన్నా, పెద్దా ఐటీ కంపెనీలు ఉండగా దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 10 లక్షల వాహనాలు రహదారులపైకి వస్తున్నట్లు అంచనా. ముఖ్యంగా జేఎన్టీయూ నుంచి ఐకియా మార్గంలో గంటకు వేలాది వాహనాలు ప్రయాణిస్తుండటంతో పీక్ అవర్స్లో రద్దీ తీవ్రంగా ఉంటోంది. దీనిని తగ్గించేందుకు ఐదు ప్రధాన అంశాలపై కంపెనీలు తప్పనిసరిగా దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.పికప్, డ్రాప్, పార్కింగ్కు ప్రత్యేక ప్రొటోకాల్: ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో ఐటీ కంపెనీల ప్రధాన ద్వారాల వద్ద క్యాబ్లు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు నిలపడం వల్ల రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. ఇకపై ఉద్యోగుల పికప్, డ్రాప్ కార్యకలాపాలను కంపెనీ ప్రాంగణంలోనే నిర్వహించేలా ప్రత్యేక ప్రాంతాలను కేటాయించాలని పోలీసులు సూచించారు.కార్ పూలింగ్కు ప్రోత్సాహం: ఒకే ప్రాంతం నుంచి వచ్చే ఉద్యోగులు వ్యక్తిగత కార్లకు బదులుగా కార్ పూలింగ్ వినియోగించేలా కంపెనీలు ప్రోత్సహించాలి. దీనివల్ల రోడ్లపై వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది.ప్రత్యేక ట్రాఫిక్ సిబ్బంది: కంపెనీల ప్రధాన ద్వారాల వద్ద ఒకేసారి షటిళ్లు, ఉద్యోగుల వాహనాలు బయటకు రావడం రద్దీకి కారణమవుతోంది. అందువల్ల వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు కంపెనీలు శిక్షణ పొందిన సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.సమీకృత రవాణా వ్యవస్థ: సమీప ప్రాంతాల్లోని పలు ఐటీ సంస్థలు కలిసి ఒకే షటిల్ వ్యవస్థను నిర్వహించాలని పోలీసులు
ప్రతిపాదిస్తున్నారు. ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఐటీ పార్కులకు పూర్తి సామర్థ్యంతో షటిళ్లు నడిపితే వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుతుంది.జోన్ల వారీగా షిఫ్ట్ విధానం: ఒకే సమయంలో వేలాది మంది ఉద్యోగులు లాగిన్, లాగౌట్ కావడం ట్రాఫిక్ రద్దీకి ప్రధాన కారణాల్లో ఒకటి. అందుకే ఐటీ కంపెనీలు జోన్ల వారీగా పని వేళలను స్వల్పంగా మార్చుకోవాలని సూచించారు. పెద్ద సంస్థలు ఒకేసారి కాకుండా కొంత వ్యవధితో ఉద్యోగుల రాకపోకలను నిర్వహిస్తే రద్దీని నియంత్రించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్, జాయింట్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆదేశాలతో రూపొందిన ఈ ప్రణాళికలో పోలీసుల చర్యలతో పాటు ఐటీ సంస్థల బాధ్యతలను కూడా స్పష్టంగా నిర్దేశించారు. వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు దీర్ఘకాలికంగా ప్రయాణ సమయాన్ని తగ్గించడమే ఈ పంచసూత్రాల ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా అధికారులు వెల్లడిస్తు్న్నారు.