© 2026 nimisham.in

రైల్వే ప్లాట్ఫామ్పై కళ్లు బైర్లు కమ్మే భయానక దృశ్యం ఒకటి కెమెరాకు చిక్కింది. వేగంగా దూసుకొస్తున్న రైలు నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి తన శరీరాన్నే అడ్డుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్లాట్ఫామ్కు, రైలు పట్టాలకు మధ్య ఉన్న ఇరుకైన సందులో ఇద్దరు పిల్లలు గోడకు అతుక్కుని ఉండగా, వారిపై వంగి ఆ తల్లి రైలు నుంచి కాపాడుతున్నట్టు కనిపిస్తుంది.రైలు అతి సమీపం నుంచి వేగంగా వెళ్తున్నప్పుడు, ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. రైలు వెళ్లేంత వరకు ఆ తల్లి, పిల్లలు గోడకే అతుక్కుని ఉండిపోయారు. రైలు వెళ్లిపోయిన తర్వాత వారు సురక్షితంగా పైకి లేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను 'భారత్ మాతా కే సేవక్' అనే 'ఎక్స్' ఖాతాలో షేర్ చేయగా, ఇది నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చాలామంది పిల్లలను కాపాడుకోవడానికి ఆ తల్లి చూపిన ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. "ఇది అమ్మ ప్రేమ, ఆ సమయంలో ఆలోచించేంత సమయం ఉండదు, ఆమె నిజమైన హీరో" అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, మరికొందరు ఆ తల్లి నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు. "అసలు అంత ప్రమాదకరమైన ప్రదేశానికి పిల్లలను ఎందుకు తీసుకెళ్లింది? ఇది ధైర్యం కాదు, బాధ్యతారాహిత్యం" అంటూ విమర్శిస్తున్నారు. అసలు ఆ కుటుంబం ఆ ప్రదేశానికి ఎలా చేరుకుంది అనే దానిపై మాత్రం స్పష్టత లేదు
.