
Union Cabinet | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో నాలుగు నూతన రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.9,450 కోట్ల అంచనా వ్యయంతో 410 కి.మీ మేర అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాలను కవర్ చేస్తూ ఈ నెట్వర్క్ విస్తరించనున్నారు. 2030-31 నాటికి ఈ కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి.. ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన సేవలందించడమే లక్ష్యమని రైల్వే శాఖ (Indian Railways) ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులలో పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్, ఒడిశాలోని భద్రక్ (రానితాల్) మధ్య 173 కి.మీ మేర నాలుగో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే, ఒడిశాలోని భద్రక్, హరిదాస్పూర్ మధ్య 75 కిలోమీటర్ల మేర నాలుగో లైన్; వీటితో పాటు ఏపీలోని గూడూరు - తమిళనాడులోని గుమ్మిడిపూండి మధ్య 90 కి.మీ; ఒడిశాలోని కటక్, పారాదీప్ మధ్య 72 కి.మీ మేర మూడు, నాలుగో రైల్వే లైన్లను నిర్మించనున్నారు. రైల్వే నెట్వర్క్ను మరో 410 కి.మీ మేర విస్తరించే ఈ నూతన ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.9,450 కోట్లుగా నిర్ణయించారు. ఈ కొత్త రైల్వే లైన్లు ఎనిమిది జిల్లాల్లోని 6,448 గ్రామాలకు రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయని రైల్వేశాఖ తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు