
ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రసారాల రూపురేఖలను మార్చేసిన ఈఎస్పీఎన్ (ESPN) సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ (93) కన్నుమూశారు. కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, నిన్న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల ఈఎస్పీఎన్ ప్రస్తుత, మాజీ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన దార్శనికతను స్మరించుకున్నారు.1970వ దశకం చివర్లో తన కుమారుడు స్కాట్తో కలిసి 24 గంటల పాటు కేవలం క్రీడల కోసమే ఒక కేబుల్ నెట్వర్క్ ఉండాలనే ఆలోచనకు బిల్ రాస్ముసెన్ బీజం వేశారు. ఈ ఆలోచన ఫలితంగా 1979 సెప్టెంబర్ 7న ఈఎస్పీఎన్ ప్రారంభమైంది. మొదట్లో ఈ కాన్సెప్ట్పై ఎన్నో సందేహాలు వ్యక్తమైనా, అనతికాలంలోనే ఇది మీడియాలో ఒక సంచలనంగా మారింది. రాస్ముసెన్ ఈఎస్పీఎన్ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు.ఈఎస్పీఎన్ ఛైర్మన్ జిమ్మీ పిటారో నివాళులర్పిస్తూ.. "రాస్ముసెన్ ఒక అసాధారణ వ్యక్తి, గొప్ప దార్శనికుడు, ఆవిష్కర్త. క్రీడలకే అంకితమైన నెట్వర్క్ ఆలోచన ఆయనదే" అని కొనియాడారు. 1970లలో ఆయన చూపిన స్ఫూర్తి, అభిరుచి ఇప్పటికీ తమ సంస్థ సంస్కృతిలో భాగమేనని తెలిపారు. ప్రముఖ యాంకర్ క్రిస్ బెర్మన్ స్పందిస్తూ.. "ఆయన మా జార్జ్ వాషింగ్టన్, ఒక మంచి స్నేహితుడు" అని అభివర్ణించారు.క్రీడా ప్రసార రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ 2025లో స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, ఏడుగురు మనవళ్లు, ఇద్దరు మునిమనవళ్లు ఉన్నారు