ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఉద్యోగం సాధించిన యువకుడు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి జిల్లా చిట్వేలి మండలం జెట్టివారిపల్లెకు చెందిన శ్రీహరి, చాముండి దంపతుల కుమారుడు దిలీప్ కుమార్ అమెరికాలోని కెంట్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకుంటున్న దిలీప్ ఐదు నెలల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్లాండ్లో నివసిస్తున్న దిలీప్ కుమార్ శనివారం రోజు స్నేహితుడిని ఎయిర్పోర్టులో వదిలేసి తిరుగు ప్రయాణం అయ్యారు. మెస్డోనియా ఓహెచ్ దగ్గర దిలీప్ కుమార్ ప్రయాణిస్తున్న కారును ఎదురు నుంచి వేగంగా వచ్చిన పికప్ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిలీప్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు.దిలీప్ కుమార్ మరణంపై కుటుంబసభ్యులకు సమాచారం రాగా.. సొంత ఊరిలో విషాదచాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో దిలీప్ మరణంపై న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి తోడుగా ఉంటామని.. దిలీప్ కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం వారికి అవసరమైన సాయం అందిస్తోందన్నారు.శ్రీహరి, చాముండిలది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం.. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు దిలీప్ కుమార్ను ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికా పంపారు. అమెరికాలో చదివి ఉద్యోగం కూడా వచ్చింది.. ఇంతలోనే కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో దిలీప్ కుమార్ మృతదేహాన్ని సొంత ఊరికి పంపించడానికి కొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. జులైలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో తెలంగాణకు చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు చనిపోయారు