© 2026 nimisham.in
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మూడు ప్రధాన డిమాండ్లతో ఏపీలో జూడాల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ల డాకర్ల నిరసనను విరమింపజేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ డాక్టర్లకు స్టైపండ్ పెంచాలని నిర్ణయించింది. జూనియర్ డాక్టర్ల స్టైపండ్ను ప్రస్తుతం రెండేళ్లకు ఓసారి సవరణ చేస్తుండగా.. ఇకపై ప్రతి సంవత్సరం సవరించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తాజా ప్రతిపాదన ప్రకారం.. ఇంటర్న్షిప్ చేసేవారికి 2026 జనవరి ఒకటో తేదీ నుంచి స్టైపండ్ ఐదు శాతం మేరకు పెంచనున్నారు. తర్వాతి సంవత్సరం నుంచి ఏటా 3 శాతం చొప్పున పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థుల స్టైపండ్ ప్రతి ఏడాది 3 శాతం చొప్పున పెంచుతామని ప్రభుత్వం ప్రతిపాదించింది.మరోవైపు ఇంటర్న్షిప్ చేసే వైద్య విద్యార్థులతో పాటుగా, పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు స్టైపండ్ను పెంచాలని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కోరుతోంది. స్టైపండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ వారం రోజులకు పైగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో ఆగస్ట్ 17 నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రులలో రోగులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే జూడాలో సమ్మె విరమింపజేసేందుకు.. వారికి స్టైపండ్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణం విధుల్లోకి చేరాలని సూచించింది.వెనక్కి తగ్గని జూడాలు..మరోవైపు ఐదు శాతం స్టైపండ్ పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై జూనియర్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త ప్రకటనేమీ చేయలేదని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తమ నిరసనలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరల ప్రకారం ఐదు శాతం స్టైపండ్ పెంపు సరిపోదని చెప్తున్నారు. తాము స్టైపండ్ 30 శాతం పెంచాలని కోరుతుంటే.. కేవలం ఐదు శాతం మాత్రమే పెంచుతామని అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో
సమ్మెను కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేదీ చూడాల్సి ఉంది.