
© 2026 nimisham.in

దుస్తులు, దుప్పట్లు, తివాచీలు ఒకరు లేదా ఇద్దరు కలిసి ఉతుకుతుంటారు. కానీ దాదాపు12 మంది ఒకేసారి తివాచీని ఉతికారు. అది కూడా వారంతా పట్టుకుని ఉతికారు.
ఇంటర్నెట్ డెస్క్: దుస్తులు, దుప్పట్లు, తివాచీలు ఒకరు లేదా ఇద్దరు కలిసి ఉతుకుతుంటారు. కానీ దాదాపు12 మంది ఒకేసారి తివాచీని ఉతికారు. అది కూడా వారంతా పట్టుకుని ఉతికారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన రాష్ట్రం మణిపూర్. ఇక్కడి ప్రజలు బెయివోలి పండగను నెల రోజుల పాటు జరుపుకున్నారు. ఈ పండగ వేడుకలు ఇటీవల ముగిశాయి.
దీంతో లియై గ్రామానికి చెందిన పలువురు యువకులు మురికి నీటితో ఉన్న చిన్న మడుగులోకి దిగారు. చొక్కాలు లేకుండా ఉన్న వారంతా తివాచీని ఆ నీటిలో ముంచి పైకి తీస్తూ పలుమార్లు ఉతికారు. అంతా ఒకే సారి వంగి పైకి లేస్తున్నారు. చుట్టూ కొండులను పచ్చదనం పరిచి ఉన్నట్లుగా ఉంది. ఈ వీడియోను ట్విట్టర్లో నేహా గురుంగ్ పోస్ట్ చేశారు.
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వీడియోలోని దృశ్యాలు ఆ ప్రాంతానికి సంబంధించిన సామూహిక స్ఫూర్తికి, కఠోర శ్రమకు ప్రతిబింబమని వారు అభివర్ణించారు. మరొకరు అయితే ఆ ప్రాంత సంస్కృతి, కష్టపడి పని చేయడంతోపాటు నిజమైన ఐక్యతకు ప్రతిబంబమని తెలిపారు. సామూహికంగా కలిసి పని చేస్తే.. సామాజిక స్ఫూర్తిని నింపవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇంకొకరు అయితే ఈశాన్య భారతదేశ సంస్కృతి ప్రత్యేకంగా ప్రశంసనీయమైనదని గుర్తు చేశారు. ఈ వీడియో లియైలోని సామూహిక జీవన విధానాన్ని కూడా చూపించిందని చెప్పారు. నెల రోజుల పాటు సాగిన ఉత్సవాల తర్వాత.. తివాచీలు శుభ్రపరిచే పని సామూహిక బాధ్యతగా ఆ ప్రాంతంలో మారిందని నెటిజన్లు పేర్కొన్నారు.







