
అస్సాంలో 103 ఏళ్ల వృద్ధురాలు మానవత్వాన్ని చాటుకున్నారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న 77 కుటుంబాలకు తన జీవితకాలంలో దాచుకున్న పొదుపు నుంచి రూ.1.54 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాకు చెందిన 103 ఏళ్ల కనకలతా దాస్ మానవత్వాన్ని చాటుకున్నారు. వరదలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు తన జీవితకాలంలో దాచుకున్న పొదుపు మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందించారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా శివసాగర్ జిల్లాలోని అమ్గురి గార్డెన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఆమె, వారికి తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శివసాగర్ జిల్లా కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన కనకలతా దాస్.. వరద బాధితులైన 77 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.1.54 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ డబ్బును ఆమె చాలా ఏళ్లుగా దాచుకున్న తన సొంత పొదుపు నుంచే ఇచ్చారు. 103 ఏళ్ల వృద్ధురాలు చేసిన ఈ సాయం అక్కడి అధికారులను కూడా కదిలించింది. డిప్యూటీ కమిషనర్ మృదుల్ యాదవ్ ఆమె నుంచి విరాళాన్ని స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. కనకలతా దాస్ చేసిన ఈ మంచి పని ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. వయసుతో సంబంధం లేకుండా అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే మానవత్వానికి ఆమె ఆదర్శంగా నిలిచారని పలువురు కొనియాడుతున్నారు. తన జీవితకాలంలో ఎంతో కష్టపడి దాచుకున్న పొదుపు మొత్తాన్ని సైతం వరద బాధితుల కోసం అందించి.. కనకలతా దాస్ సేవాభావం, దాతృత్వం, మానవత్వానికి ఆదర్శంగా నిలిచారు. బెంగళూరులో దారుణం.. భర్త, నాలుగేళ్ల కుమారుడి మృతి.. భార్యపై అనుమానం.. నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు: మల్లికార్జున ఖర్గే