
ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులు.. పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ప్రజ్వరిల్లాయి. యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. హర్మూజ్ జలసంధి వేదికగా ఇరాన్ వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడటంతో , అమెరికా ప్రతిదాడి ప్రారంభించింది. అమెరికా రక్షణ శాఖ సోషల్ మీడియా వేదికగా ఈ దాడులకు సంబంధించి ప్రకటనను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం తుర్కియేలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ పరిణామాలపై స్పందించారు. ఇరాన్ దుశ్చర్యకు బుద్ధి చెప్పేలా రూపొందించిన వైమానిక దాడి ప్రణాళికకు ఆయన అక్కడి నుంచే ఆమోదం తెలిపారు. అమెరికా వైమానిక దాడుల ధాటికి దక్షిణ ఇరాన్లోని రేవు పట్టణాలు బందర్ అబ్బాస్, సిరిక్, క్వేష్మ్ దీవుల పరిసర ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థలు తమ భూభాగంలో సంభవించిన ఈ భారీ పేలుళ్లను ధ్రువీకరించాయి. అమెరికా కమాండ్ బలగాలు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేలా వ్యూహాత్మక లక్ష్యాలపై క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ మెరుపు దాడుల్లో ఇరాన్కు చెందిన వాయు రక్షణ వ్యవస్థలు, కోస్టల్ రాడార్ సైట్లు, ఉపరితలం నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే అత్యాధునిక క్షిపణి కేంద్రాలు, డ్రోన్ లాంచ్ ప్యాడ్లు ధ్వంసమయ్యాయి. వీటితో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కి చెందిన 60కి పైగా చిన్న తరహా యుద్ధ నౌకలను అమెరికా క్షిపణులు సముద్రంలోనే నామరూపాలు లేకుండా చేశాయి. ఈ స్థాయి విధ్వంసం ఇరాన్ నావికా, వైమానిక రక్షణ వ్యవస్థలను కోలుకోలేని దెబ్బతీసింది. యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) నివేదికల ప్రకారం.. అసలు వివాదం ఒమన్ తీరానికి సమీపంలో మొదలైంది. ఇరాన్ దళాలు అక్కడ ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన ఒక ముడి చమురు ట్యాంకర్, ఖతార్కు చెందిన ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) ట్యాంకర్ సహా మొత్తం మూడు వాణిజ్య నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశాయి. ఈ దాడుల నేపథ్యంలో అమెరికా కఠిన నిర్ణయం తీసుకుంది