
పానీ.. పానీ.. పానీ.. గుక్కపెట్టి ఏడుస్తున్న పాకిస్థాన్ప్రధాని
కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్ లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో సింధు జలాల ఒప్పందం అంశాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లేవనెత్తారు. సింధు జలాల నిలిపివేతపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నది జలాలను పాకిస్థాన్ కు జీవనాధారంగా అభివర్ణించారు. నీటిని రాజకీయ లబ్ధి కోసం ఎన్నడూ ఆయుధంగా ఉపయోగించకూడదని అన్నారు. సింధు జలాలు మా ప్రాంతంలో జీవనాధారం. లక్షలాది మందిని సింధు జలాలు బతికిస్తున్నాయి. మా భూమిని తడుపుతున్నాయి. భావి తరాల కోసం ఇప్పుడున్న వనరులను సంరక్షిస్తున్నాయి అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా మన దేశానికి చురకలు అంటించే ప్రయత్నం చేశారు.సింధు జలాల అంతర్జాతీయ ఒప్పందాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవించాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నొక్కి చెప్పారు. ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ మధ్య సింధు జలాల పంపిణీ నిలిపివేత వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతేడాది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లోయలో పాకిస్థాన్ కు చెందిన ముష్కరులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో పాకిస్థాన్ పై భారత్ మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రమూకలను ఏరివేసింది. అంతేకాక అదే సమయంలో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేంత వరకు సింధు జలాల అంశం ఒప్పంద కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు అని ప్రధాని మోదీ ఆ సందర్భంలో పేర్కొన్నారు. ఇక సింధు జలాలను విడుదల చేయాలని.. ఒప్పందాన్ని పునరుద్ధరించాలని పదేపదే పాకిస్థాన్ డిమాండ్లు చేస్తూ వస్తోంది. ఎందుకంటే పాకిస్థాన్ లో నీటి కొరత తీవ్రంగా పెరుగుతోంది.