చాట్ జీపీటీలో ఎలా చంపాలని వెతికి మరీ.. అమెరికాలో తల్లిని, సోదరుడిని చంపేసిన భారత సంతతి కుర్రాడు
Arjun Aravind Double Murder Case : అమెరికాలోని మాసాచుసెట్స్ స్టేట్లో అత్యంత తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన వెలుగులోకి వచ్చింది. సబర్బన్ ప్రాంతంలోని సొంత నివాసంలోనే భారత సంతతికి చెందిన 17 ఏళ్ల టీనేజర్.. చాట్జీపీటీలో ఎలా హత్యలు చేయాలని చూసి మరీ.. తన కన్నతల్లి, సోదరుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆపై తల్లి కారు తీసుకుని ఇంటికి దూరంగా పారిపోయాడు. కానీ విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే నిందితుడి కోసం తీవ్రంగా గాలించి.. తెల్లారేసరికే పట్టుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.అసలేం జరిగిందంటే..?బోస్టన్ నగరానికి దాదాపు 48 కిలో మీటర్ల దూరంలో ఉన్న యాక్టన్ అనే ప్రాంతంలోని మార్తా లేన్లో అరవింద్, ఆయన భార్య 45 ఏళ్ల సుధా వెంకటేశన్, కుమారులు 17 ఏళ్ల అర్జున్ అరవింద్, 14 ఏళ్ల సిద్దార్థ్ అరవింద్లు నివాసం ఉంటున్నారు. ఇక్కడ వారికి సొంత ఇళ్లు ఉండగా.. అర్జున్ అరవింద్ యాక్టన్-బాక్స్బరో రీజినల్ హైస్కూల్లో చదువుకుంటున్నాడు. అయితే మంగళవారం రోజు సాయంత్రం 6.30 గంటల వీరి ఇంటికి ట్యూటర్ వచ్చిది. తలుపులు మూసి ఉండడం, ఎంత పిలిచినా ఎవరూ రాకపోవడంతో, ఫోన్లు చేసినా ఎవరూ ఎత్తకపోవడంతో.. ఆమె అరవింద్కు ఫోన్ చేసింది. ఇంట్లో వాళ్లెవరూ తలుపులు తీయట్లేదని చెప్పింది.దీంతో అరవింద్ కూడా భార్యకు, కుమారులకు ఫోన్లు చేయడం ప్రారంభించాడు. కానీ ఆయన కాల్స్ కూడా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన వీరి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూసే సరికి బేస్మెంట్లో సుధా వేంకటేశన్ మృతదేహం, మొదటి అంతస్తులో సిద్ధార్థ్ మృతదేహం లభ్యం అయ్యాయి. బాధితుల శరీరాలపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు.. ఈ హత్యలకు పాల్పడింది వీరి పెద్ద కుమారుడు అర్జున్ అరవింద్ అని తేల్చారు