
వరుస దెబ్బలు- వెన్ను చూపక తప్పట్లేదు
ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఏదీ కలిసి రావట్లేదు. ఒకదాని వెంట వరుస దెబ్బలు తగులుతున్నాయి. కొన్ని కీలక విషయాల్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. మొన్నటికి కాక్రోచ్ జనత పార్టీ ధాటికి ఏకంగా కేంద్ర మంత్రే రాజీనామా చేయాల్సొచ్చింది. దాని నుంచి తేరుకోకముందే.. బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో చేతు అనుభవాన్ని చవి చూసింది. సాక్షాత్.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడే ఖాళీ చేసిన ఈ కంచుకోటను నిలబెట్టుకోలేకపోయింది.2010 నుంచి ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహిస్తూ వచ్చిన ఈ నియోజకవర్గాన్ని బంగారం పళ్లెంలో పెట్టి మరీ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వాన్ని వహిస్తోన్న బీజేపీ. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మడమ తిప్పక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కులం, విద్యార్థులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను పునఃసమీక్షించుకుంటోండటం దీనికి నిదర్శనం.దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష నిరోధానికి తీసుకొచ్చిన నూతన యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోనుంది కేంద్రం. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సైతం తెలియజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అధికారికంగా సమాచారం ఇచ్చారు.యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోవడం అనేది.. కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బే. ఈ నిర్ణయం వెనుక కీలక రాజకీయ పరిణామాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇటీవలి కాలంలో ఈ నిబంధనలపై అగ్రవర్ణ సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని బాంకీపూర్ ఉప ఎన్నిక రెఫరెండంగా భావించినట్టయింది. ఇక్కడ ఓటమిపాలు కావడం.. ప్రజల్లో, ప్రత్యేకించి.. అగ్రవర్ణ సామాజిక వర్గాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత పేరుకుపోయిందనేది స్పష్టమైంది.దాదాపు మూడు దశాబ్దాలుగా తమ కంచుకోటగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని ప్రశాంత్ కిశోర్కు ధారాదాత్తం చేసుకోవడం వెనుక యూజీసీ నిబంధనలపై వ్యక్తమైన అగ్రవర్ణాల అసంతృప్తే కారణమని బీజేపీ అంతర్గత వర్గాలు విశ్లేషిస్తోన్నాయి